మండుటెండల్లో మూడు కిలోమీటర్ల నడక
మెదక్ : పరిశుభ్రమైన మంచినీటిని, కాచి, చల్లార్చి తాగాలని ప్రభుత్వం ఢంకా బజాయిస్తోంది. అలా చేయకుంటే రోగాల బారిన పడతారని సెలవిస్తోంది. కనీసం నీరే దొరక్క అల్లాడుతున్న ప్రజలు, దాని కోసం కోసుల కొద్ది నడిచిపోతున్నారని గుర్తించి, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం మరీ శోచనీయం. నారాయణఖేడ్ మండలంలోని అంబేదా గ్రామ పంచాయతీలోని పిర్లతండా గిరిజనులు గుక్కెడు నీటి అనునిత్యం యాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఒకటి కాదు, రెండు కాదు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటు న్నారు ఆ గ్రామ గిరిజనులు. ఎండలో నరకయాతన అనుభవిస్తూ వారు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. సోమవారం నాడు ప్రజాశక్తి ఆ గ్రామాన్ని సందర్శించింది. వారి సమస్యలను తెలుసుకొంది. గ్రామపంచాయతీలోని పిర్ల తండా గిరిజనులు నీటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. ఆ గ్రామంలో 120 గృహాలు ఉంటాయి. కాని ఇప్పటి వరకు ఒక్క చేతి పంపును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తండా బయట ఒకే ఒక్క చేతిపంపు ఉంది. అది కూడా ఎండాకాలం భూగర్భ జలాలు ఇంకి పోవడంతో గంటల తరబడి కొట్టినా కాస్తో, కూస్తో నీరు రాల్చదు. ఇక గత్యంతరం లేక ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరు బావులపై ఆధారపడి నీటికోసం యాతన అనుభవిస్తున్నారు. ఆ తండాలో సుమారు 500 గేదెలు ఉన్నాయి. వాటి పరిస్థితి మరీ దయనీయం. నీరు లేక మూగ జీవులు అల్లాడుతున్నాయి. మనుషులకే నీరు లేని ఆ ప్రాంతంలో ఇక వాటి పరిస్థితి ఊహిస్తేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. తండాల్లో జనాన్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారి సమస్యలు పట్టించుకోవడం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎన్నో హామీలిస్తారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆ గ్రామంలో ఎవ్వరిని కదిలించినా కన్నీటితో నిండిన మొహంతో చెబుతున్నారు. ‘అయ్యా నాయకులంతా ఫిల్టర్ నీరంట అది తాగుతారు. కానీ మాకు కనీసం మంచినీరు కూడా అందడం లేదు. మేము ఓట్లేస్తేనే కదా మీరు అక్కడిదాకా వెళ్తున్నది. మా సమస్యలు పరిష్కరిస్తామంటేనే కదా ఆశతో మేము ఓటేసింది. మా సమస్యలు మర్చిపోయారా?’ అని ప్రజాశక్తి సాక్షిగా ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ‘సారూ.. నీటి కోసం వెళ్లే రోడ్డంతా రాళ్లతో నిండి ఉంటుంది. ఈ ఎండలకు కాలుతున్న రాళ్లపై నడుస్తూ వెళ్లి తెచ్చుకుంటున్నాం. ఇక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. వారికి ఇది కనపడడం లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఆ బావి నీరు రోగాలకు నిలయం
ఇక్కడి గిరిజనులు మైళ్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకుంటున్న బావి నిండా చెత్తా చెదారంతో నిండి ఉంటుంది. ఆ నీటిని తాగడం రోగాలకు రహదారి వేసినట్లే. ఇప్పటికే చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. అయినా తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది తండాలు వదిలి ఎండాకాలం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ః
ఎండా కాలం మరీ దారుణం : లాలు గ్రామస్తుడు
ఎండ కాలం వచ్చిందంటే చాలు నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆ తండా వాసి లాలు తెలిపారు. నీటి కోసం ఊరి బయట ఉన్న బావి వద్దకు వెళ్లాలని తెలిపాడు. ఇక్కడ మనుషులతో పాటు పశువులు కూడా నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఓటు కోసం మాత్రమే నాయకులు ఇక్కడికి వస్తారని, ఆ తర్వాత మా కష్టాలు చుసేవారే ఉండరన్నారు. ఎండాకాలంలో నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.
నీటి సౌకర్యం కల్పించండి : గాణు తండా వాసి
తండాలో చేతిపంపులు లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరం నుండి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తండాకు చెందిన గాణు తెలిపారు. ఎండలు ఈ తండాలో బోరు వేసి నీటి ఎద్దడి తీర్చాలని ఆయన కోరారు.
ఎండలో నీటి కోసం తిప్పలు పడుతున్నాం : లకిëభాయి తండావాసి
మండుతున్న ఎండలో, కాలు కాలుతున్నా కిలోమీటర్ల దూరం నీటి కోసం వెళ్లాల్సి వస్తోందని తండాకు చెందిన లకిëభాయి తెలిపింది. ఒక్కరు, కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిందెలు చేతపట్టుకొని నీటి కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. చిన్న పిల్లలు సైతం నీటి కోసం ఎండలో నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
నీటి ఎద్దడి నివారణకు రూ.3 కోట్లు
గత ఆదివారం నాడు అంబేద గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ సురేష్కుమార్ను అడ్డుకొని నీటి ఎద్దడిని తీర్చాలని ఆందోళనకు దిగారు. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ ఈ గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు మూడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో మంజీరా నది నుంచి పైప్లైన్ను ప్రారంభించి నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Filed under: వార్తలు | Leave a Comment »