నవంబరు 9, 2009

పుల్లరిన్‌లో త్వరలో జిల్లా అగ్రస్థానం

కడప: కడప జిల్లాలో పుల్లరిన్‌ పరిశోధనలు పూర్తి అయితే ప్రపంచంలోనే కడప జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుందని తిరుపతి ఎస్వీ యూనివర్సీటీ భూగర్భ పరిశోధనా విభాగా ప్రొఫెసర్‌ ఆర్‌టి. హనుమంతు చెప్పారు. కడప జిల్లాలోని మంగంపేట ఎంపిఎండిసి బైరేటిస్‌ గన్నుల నుండి వెలికితీసిన మట్టి నమూనాల సేకరణ కోసం నేడు ఆయన వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిఎండిసి గతంలో రూ.6కోట్ల నుండి నేడు రూ.150కోట్ల లాభాల్లో పయనిస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎపిఎండిసికి మంచి గుర్తింపు ఉందని తెలిపారు. బైరేటీస్‌కోసం వెలిక్కి తీసి పారేసిన నల్లరాయితో సిరులు కురిపించవచ్చునని ఆయన చెప్పారు. పుల్లరిన్‌ పరిశోధనకు తాము విశేషంగా కృషి చేస్తున్నామని చెప్పారు. పుల్లరిన్‌ ప్రధానంగా ఈ పరిశోధనలో తీసుకున్నామని అన్నారు. అతి త్వరలో అంతర్జాతీయస్థాయిలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో పుల్లరిన్‌ వెలికితీతపై తిరుపతిలో ఒక సెమినార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా, అరుదైనదిగా భావించే పుల్లరిన్‌ భారతదేశంలో ఉత్పత్తిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వివరించారు.

నవంబరు 9, 2009

ఐఎన్‌టియుసి అధ్యక్ష, కార్యదర్శుల నియామకం

కడప: కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ అయినా ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షునిగా కె.ఆంజనేయులును నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు చెప్పారు. అలాగే ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా సుబ్బరాయుడిని కూడా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల ద్వారాఈ ఎంపిక చేసామని ఆయన స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని స్పష్టం చేసారు.

నవంబరు 9, 2009

కేంద్రబృందం జిల్లా పర్యటన రద్దు దారుణం: సిపిఐ

కడప: కేంద్ర కరువు బృందం కడప జిల్లా పర్యటన రద్దు చేసుకోవడం అత్యంత దారుణమైనదిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. కృష్ణమూర్తి ఆరోపించారు. జిల్లాలో పర్యటించకపోతే రైతుల కడగండ్లు, రైతుల బాధలు వారికి ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పర్యటించకుండా తిరుపతిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో కరువు బృందం సమీక్షా సమావేశాన్ని నిర్వహించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కరువు పరిస్థితులతో విలవిలలాడుతున్న జిల్లా ప్రజల దయనీయస్థితిగతులను ప్రత్యక్ష్యంగా చూడకుండా రైతాంగం నష్టపోయిన విషయాన్ని కరువు బృందం కేంద్ర ప్రభుత్వ దృష్టికి సమగ్రంగా తీసుకువెళుతుందన్న నమ్మకం జిల్లా ప్రజల్లో కొరవడిందని ఆయన చెప్పారు. కేంద్రబృందం పర్యటించకపోవడంతో 55గ్రామాలలో జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కరువు రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగినా పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

నవంబరు 9, 2009

ఎయిడ్స్‌పై లెక్చరర్లకు, టీచర్లకు వర్క్‌షాప్‌ నిర్వహణ

కడప: కడప జిల్లాలోని కిషోర బాలికల్లో ఎయిడ్స్‌ సోకకుండా నివారించగలిగే శక్తి సామర్థ్యాలు ఒక్క విద్యాశాఖకే ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి ఎయిడ్స్‌ నివారణకు సంబంధించి లెక్చరర్లు, టీచర్లకు రాత్రి జరిగిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్‌వ్యాధి పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈవ్యాధిపట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉంటే ఎయిడ్స్‌రహిత జిల్లాగా కడపను తీర్చిదిద్దవచ్చునని ఆయన చెప్పారు. నేటి యువత చెడువ్యసనాలకు బానిసగా మారుతుందన్నారు. సెక్స్‌పట్ల ఉత్సాహం ఎక్కువగా ఉంటుందని అందువల్ల యువతలో ఆలోచించే శక్తి అవగాహనాలోపంతో తప్పుడు మార్గాన పయనిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందువల్ల మొదట అధ్యాపకుల్లోనే ఈవ్యాధిపట్ల అవగాహన కల్పిస్తే మంచిఫలితాలు సాధించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా ఎడ్యూకేషన్‌ హెల్త్‌ అధికారి గుణశేఖర్‌ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల సహాకారంతో ఈవ్యాధిని అరికట్టవచ్చునని చెప్పారు. ఈకార్యక్రమంలో డిపిఎం సురేష్‌, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యూకేషన్‌ అధికారి ఈశ్వరయ్యతోపాటు పలువురు విద్యాశాఖ, అధికారులు పాల్గొన్నారు.

నవంబరు 9, 2009

అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని విఫలమైన ప్రభుత్వం: కృష్ణమూర్తి

కడప: కడప జిల్లాలో ఉపాధి హామీ పనుల నిధుల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా అధికార యంత్రాంగం నేడు విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి కృష్ణమూర్తి ఆరోపించారు. ఆయన ఈఎంఎస్‌తో మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం ప్రకటనలు రికార్డులకే పరిమితం అయ్యాయని అన్నారు. డ్వామా పిడి అవినీతికి గురైన సోమ్మును వివిధ పద్ధతుల ద్వారా కోటీరూపాయలు వసూలు చేస్తామని ప్రకటించిన రెండు రోజులకే అవినీతి మొత్తం రూ.2కోట్లకు పైగా ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందిందన్నారు. అధికారుల ప్రకటనలు చూస్తే ఆ మొత్తం పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పారు. ఉపాధి నిధుల ద్వారా కూలీలకు జీవిత భద్రతను కల్పించడంతోపాటు వారికి జీవనోపాధిని కూడా కల్పించాల్సి ఉందన్నారు. అయితే నేడు ఆ నిధులు దుర్వినియోగం కావడంతో గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఉపాధికోసం వలసలకు పోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందో ఈ పథకంలో చోటు చేసుకున్న అవినీతి కారణంగా ఆ లక్ష్యం నీరుగారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఈ పథకంలో విచ్చలవిడి అవినీతి చోటు చేసుకోకుండా పథకంపైనే కూలీలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతేగాకుండా వ్యవసాయ కార్మిక సంఘాలు, మండలస్థాయి మహిళా సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నిధుల స్వాహాకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.