ఫిబ్రవరి 6, 2010

ఇష్టారాజ్యం… ఇబ్బందుల మయం!

ఆదిలాబాద్‌: నిబంధనల ప్రకారం.. భద్రతా చర్యలు తీసుకుని ఉపయోగించాల్సిన పేలుడు పదార్థాల్ని ఇష్టారాజ్యంగా, బహిరంగంగా ఉపయోగిస్తుండటంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోననే భయం జాతీయరహదారి పనులు సాగుతున్న ప్రాంతాల్లోని పల్లెవాసుల్లో వ్యక్తమవుతోంది. పేలుడు పదార్థ నిపుణుల పర్యవేక్షణలో రాళ్ళు, మట్టి లాంటివాటిని పేల్చాలని నిబంధనలున్నా అమలవడం లేదు. జిల్లాలో కొనసాగుతున్న ఏడో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకోసం కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పేలుళ్ళను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనా ఎలాంటి చర్యలు లేవు. ఏడో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఎత్తుపల్లాలను సరిచేసేందుకు, ఎత్త్తెన గుట్టలు, రాళ్ళను పిండిచేసేందుకు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సిబ్బంది భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల పల్లెలు, గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. 2009లో కుప్టి ఘాట్‌ వద్ద భారీ పేలుడు పదార్థాలను ఉపయోగించి చేసిన పేలుళ్ళతో ఆ గ్రామంలోని సగానికిపైగా పగుళ్ళిచ్చి దెబ్బతిన్నాయని అప్పట్లోనే గ్రామస్థులు నెత్తినోరు బాదుకున్నారు. 2009 జనవరి మూడో వారంలో చేసిన పేలుళ్ళ ధాటికి ఎగిరివచ్చిన ఒక పెద్దరాయి తగలడంతో కుప్టి గ్రామంలో ఉన్న ఆటో ధ్వంసమయ్యింది. ఇది పెద్ద సమస్యగా తయారుకావద్దనే ఉద్దేశంతో కాంట్రాక్టరు ఆ ఆటో యజమానికి పరిహారంకూడా ఇచ్చారు.

ఎలాంటి నిబంధనలు పాటించకుండా, భద్రతా చర్యలు తీసుకోకుండా పేలుడు పదార్థాలను ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారని నిర్మల్‌కు చెందిన జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తి నిర్మల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. దీనిని పరిశీలించిన కోర్టు 5.12.2008న కేసులు నమోదు చేయాలంటూ మామడ, నిర్మల్‌(రూరల్‌) పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. నిర్మల్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో 104/2008గా ఐపీసీ సెక్షన్లు 426, 427, 420, ఆర్‌/డబ్ల్యూ 34, పీడీపీపీ యాక్ట్‌ సెక్షన్‌ 3, పేలుడుపదార్థాల చట్టం 9-బి, 9-సి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. అలాగే మామడ పీఎస్‌లోనూ కేసు నమోదయ్యింది. అదే వ్యక్తి రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును 12.1.2009న పోస్టుద్వారా స్వీకరించిన నేరడిగొండ పోలీసులు ప్రాథమికంగా విచారించడానికి దాదాపు నెలరోజుల సమయం తీసుకుని 16.2.2009న 15/09గా కేసు నమోదు చేశారు.

కేసులు నమోదవుతున్న అంశాన్ని తెలుసుకున్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీవారు జిల్లాలో ఉన్న పేలుడుపదార్థాల అనుమతి ఉన్న డీలరు శ్రీరామా ఎక్స్‌ప్లోజివ్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం రాసుకోవడానికి 27.10.2008నాడు రూ. 10 ముఖ విలువగల స్టాంపు పేపర్లను బోథ్‌లోని స్టాంప్‌ వెండర్‌ నుంచి కొనుగోలు చేశారు. ఒప్పందం కుదుర్చుకుంది మాత్రం 5.9.2008 నాడు కావడం గమనార్హం. అంటే దాదాపు స్టాంపు పేపర్‌ కొన్న నెలన్నర రోజుల ముందే అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారట. ఇంత జరిగినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇస్లాంనగర్‌ నుంచి మొదలుకుని కడ్తల్‌ వరకు జరుగుతోన్న పనుల్లో చాలాచోట్ల ఇప్పటికీ పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా.. పెద్దఎత్తున పేలుడు పదార్థాలను పెట్టడం వల్ల భారీ పేలుళ్ళకు ఏం జరుగుతుందోనని సమీపంలోని గ్రామాలు, పల్లెలు, తాండాల ప్రజలు భయపడుతున్నారు. పైగా పేలుడు పదార్థాల రవాణాలో సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, బహిరంగంగా వాడుతున్నారు. దీనితో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఈ విషయమై జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ను సంప్రదించగా.. పేలుడు పదార్థాలకు అనుమతి ఉన్న సంస్థతో కాంట్రాక్టరు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు. అయినా కేసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటానన్నారు.

ఫిబ్రవరి 6, 2010

ఆక్రమిత భూములపై ప్రత్యేక దృష్టి

నెల్లూరు: ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా పంపిణి చేయాల్సిన భూముల ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా జిల్లా యంత్రాంగం భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూముల మీద దృష్టి సారించింది. అయితే ఈప్రక్రియ పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉండడంతో అధికారులకు కత్తీమీద సాములా తయారైంది. ఈ ఏడాది అంబేద్కర్‌ జయంతిన 15వేల ఎకరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నియమించింది. 2005లో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 42వేల ఎకరాలను భూస్వాముల నుండి స్వాధీనం చేసుకోని బలహీనవర్గాలకు పంపిణీ చేసారు. భూస్వాముల నుండి భూములను స్వాధీనం చేసుకోవడంలో అడుగడుగునా రాజకీయ ఒత్తిళ్ళను అధికారులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గతంలో భూస్వాముల నుండి భూములు స్వాధీనం చేసుకున్న ఫలితంగా అనేకమంది జాయింట్‌ కలెక్టర్లు రాజకీయ బదిలీలకు గురి కాగా నేడు జెసి సౌరభ్‌గౌర్‌ ఈప్రక్రియను చేపట్టిరు. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా నియమితులైన సౌరభ్‌గౌర్‌ ముక్కుసూటిగా వ్యవహారించే మనిషి. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరగిన సందర్భంగా నెల్లూరు నగరంలోని నిత్యావసర వస్తువుల ధరల గోడౌన్లను తనిఖీకి వెళ్ళిన సందర్భంలో ఆయన రాజకీయ నాయకుల వల్ల చేదుఅనుభవనాలను ఎదురుచూసారు. ఈ నేపథ్యంలో భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రక్రియను ప్రారంభించారు. గతంలో ఎస్పీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కానీ కొనడం కానీ అమ్మడం కానీ నేరం అవుతుంది. ఒకవేళ ఎస్సీలు భూములు అమ్మినప్పటికీ వాటిని కొన్నవారి మీదే ఎక్కువగా నేరం ఆక్షేపితం అవుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌ రాజశేఖర్‌ మొదటి విడత భూముల పంపిణి సందర్భంగా 26వేల ఎకరాల భూములను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని పేదలకు పంచారు. రాష్ట్రంలోనే ఇది రికార్డు. అయితే అసలు కథ తరువాతే ప్రారంభం అయింది. కలెక్టర్‌ రాజశేఖర్‌ను నెలతిరగకుండానే అప్పటి వై.ఎస్‌.ఆర్‌. మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ను ప్రాధాన్యం లేని పోస్టుకు తరలించడంలో ఇక్కడి రాజకీయ నాయకులు పెద్దపాత్రే పోషించారు. అటు తరువాత వచ్చిన రవిచంద్ర, పరిస్థితులకు రాజీపడిపోయి భూముల స్వాధీనంలో మెతకవైఖరిని అవలంభించారు. ఫలితంగా 2006,2007,2008 ప్రాంతంలో కేవలం 5,6వేల ఎకరాలను మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దశాబ్దాల తరబడి అసైన్డ్‌ భూములన్నీ ఆయా గ్రామాల్లో పెత్తందార్ల చేతుల్లో ఉన్నందున వారు వాటిమీద లక్షలకు లక్షలుగా పెట్టుబడులు పెట్టి పనికిరాని భూములను పంటపోలాలుగా మార్చారు. తీరా భూముల్లో బంగారం పండే సమయంలో తమ వద్దనుంచి భూములను లాక్కొవడం ఏమేరకు న్యాయం అని గతంలో కోర్టును కూడా ఆశ్రయించినప్పటికీ వారికి వ్యతిరేకంగానే కోర్టు తీర్పు వెలువడింది. జిల్లాకు చెందిన 50మంది రైతుల మీద క్రిమినల్‌ కేసులను కూడా నమోదు చేయాలని హైకోర్టు 2005లో సంచలన తీర్పునిచ్చింది. ఈ పరిస్థితుల్లో సౌరభ్‌గౌర్‌ భూముల ప్రక్రియను ప్రారంభించారు. ఏమేరకు అన్యాక్రాంతం భూములను స్వాధీనం చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

ఫిబ్రవరి 6, 2010

సాయం అందేది ఎన్నటికో …?!

పిడుగురాళ్ల: గత ఏడాది అక్టోబర్‌ మాసంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి వరద రూపంలో పోటెత్తడంతో పచ్చటి పొలాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న గృహాల్లోకి సైతం భారీ ఎత్తున వరద నీరు చేరడంతో అన్ని విధాలుగా నష్టపోయిన తమకు సాయం అందేది ఎన్నటికో అర్థం కావడం లేదని పల్నాడు ప్రాంతంలోని వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఊహించని రీతిలో గత ఏడాది అక్టోబర్‌ మూడవ తేదీన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి మండలంలోని తంగెడ, ఏలియం పేట, కాట్రపాడు, రామాపురం, పొందుగుల, మాచవరం మండలంలోని గోవిందాపురం, వెల్లంపల్లి, రేగులగడ్డ, బెల్లంకొండ మండలంలోని పులిచింతల, కోళ్లూరు,కేతవరం, చిట్యాల, చిట్యాల తండా, గొల్లపేట, బోదనం తదితర ప్రాంతాల్లో తీవ్రంగా పంటకు న ష్టం చేకూరడంతో పాటు గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ఆయా గ్రామాల ప్రజానీకం కొంత మేర ఆస్తినష్టాన్ని సైతం చవిచూడాల్సి వచ్చింది. అప్పటికే రైతన్నలు పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం నీటి పాలవ గా బెల్లంకొండ మండలంలో 572 గృహాలు నీట మునగగా వాటిలో 11 గృహాలు పూర్తిగా, మరో 18 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదే విధంగా మాచవరం మండలంలో 211 గృహాలు నీటమునగగా 23 పూర్తిగా, 17 పాక్షికంగా, దాచేపల్లి మండలంలో 153 గృహాలు నీట మునగగా 12 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే వరద సమయంలో ఇటు ప్రభుత్వం అటు స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయక చర్యలు చేపట్టడం, అనంతరం పరిణామాల క్రమంలో వరద బాధితులకు పరామర్శల వెల్లువ పోటెత్తింది. అయితే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమకు నాలుగు నెలలవుతున్నా ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పంటలు వేసి పెట్టుబడులు పెట్టిన తాము ఊహించని రీతిలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు పేర్కొంటున్నారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ పరంగా సాయం కోసం ఎదురు చూపులు మినహా సాయం అందించే వారే కరువయ్యారని వారు ఆరోపిస్తున్నారు.

తిరిగి నష్టాల నుండి కోలుకునేందుకు అందిన చోటల్లా అప్పులు చేసినా కాలువ చివరనున్న తమ భూములకు నీరు తగిన విధంగా అందక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. నాడు నీరు పోటెత్తడంతో నష్టపోయిన తాము నేడు నీరు అందక నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇప్పటికైనా గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన కృష్ణానది వరద ముంపు బాధితుల మైన తమపై కనికరం చూపాలంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు రీతిన స్పందించి త క్షణమే తమకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణానది వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయిన పల్నాడు ప్రాంతంలోని నదీ పరివాహ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఫిబ్రవరి 6, 2010

మృత్యుంజయుడు మల్లయ్య

- 19గంటలు జీవన్మరణ పోరాటం
హైదరాబాద్‌: నారాయణగుడా సెంటర్‌లో శుక్రవారం భవనం కూలిన ఘోర దుర్ఘటనలో 13మంది మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున భవన శిథిలాలను తొలగించడంలో పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, రెస్క్యూబృందాలు, స్థానికులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. దాదాపు 19గంటల అనంతరం శనివారం ఉదయం భవన వాచ్‌మెన్‌ మల్లయ్యను రెస్క్యూ బృందం ప్రాణాలతో బయటికి తీసుకురాగలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేసారు. స్వల్ప గాయాలు మినహా మల్లయ్య సురక్షితంగా ఉన్నాడని ఆయన చెప్పారు. జరిగిన ప్రమాదానికి మల్లయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడని, సమాచారాన్ని పూర్తిగా వెల్లడించలేని పరిస్థితిలో ఉన్నాడని రెస్క్యూబృందం తెలిపింది. దాదాపు 19గంటలు శిథిలాలలో చిక్కుకొని ఆందోళన చెందిన మల్లయ్య ఎట్టకేలకు మృత్యుంజయుడై బ్రతికి బయటపడడం పట్ల అతని బంధువులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేసారు. కాగా కూలిన భవనానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిసిందని కలెక్టర్‌ తెలిపారు.

ఫిబ్రవరి 6, 2010

సాగునీరు లేక ఎండుతున్న పంటలు

మహబూబ్‌నగర్: ఆర్టీఎస్‌ ఆయకట్టు పొలాలకు సాగునీరు అందకపోవడంతో వేరుశనగ, సద్ధలు, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పంటలు వేస్తున్నామని తక్కశిల రైతులు కె.రాముడు, భాస్కర్‌, జయరాముడు తదితరులు తెలిపారు. పంటలకు నీళ్లు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఆర్టీఎస్‌ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు రెండు రోజుల్లో అందించేందుకు అన్నీ చర్యలు తీసుకున్నామని డిఇ మధుకర్‌రెడ్డి తెలిపారు.