MANYASEEMA TELUGU DAILY


MANYASEEMA TELUGU DAILY

http://www.manyaseema.com/index.php?a=epaper

మన్యసీమ తెలుగు దినపత్రిక


http://www.scribd.com/fullscreen/120973838

మన్యసీమ తెలుగు దినపత్రిక


http://www.scribd.com/fullscreen/120973838

01ph02hy.jpg


పాతబస్తీలో బయల్పడిన నందివిగ్రహం


హైదరాబాద్‌: నగరంలోని మంగల్‌హాట్‌లో ఒక ప్రభుత్వభూమిలో తవ్వకాలలో బయల్పడిన నందివిగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇది భూగర్భదేవాలయమని పాతబస్తీలో పుకార్లు వ్యాప్తి చెందాయి. దాంతో భారీగా గుంపులు అక్కడకు చేరుకున్నాయి.” విద్యుత్‌ శాఖ ఒక విద్యుత్‌ ఉపకేంద్రాన్ని నిర్మించేందుకు తవ్వకాలు జరుపతున్నపుడు ఒక నందివిగ్రహం బైటపడింది.” అని మంగల్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి జి.శ్రీధర్‌ చెప్పారు. తరువాత పురావస్తుశాఖ నిపుణులు అక్కడకు వచ్చి పరిశీలించారన్నారు. అది తూర్పువైపు చూస్తోందని శ్మశానవాటికను సూచిస్తోందని చెప్పారు. వ్యతిరేక దిశలో ఆలయం ఉండేఅవకాశాలు లేవన్నారు. ఈ భూమిని ఇటీవల భూకబ్జాదారుల నుంచి విముక్తి చేసినట్లు ఎమ్మార్వో చంద్రకళ చెప్పారు. గణేశవిగ్రహతయారీదారులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని వారిని తాము ఖాళీ చేయించామని ఆమె చెప్పారు. ఆలయం ఇక్కడ ఉండేదన్న మాట అవాస్తవమన్నారు. పంచనామా నిర్వహించి విగ్రహవివరాలను రికార్డులలోనికి ఎక్కించారు.

రైలు ఢీకొని 6 ఏనుగులు, ఒక వ్యక్తి మృతి


భువనేశ్వర్‌: ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆదివారం రైలు ఢీకొని ఆరు ఏనుగులు, ఒక వ్యక్తి చనిపోయారు. హౌరానుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రంభ, గూమా స్టేషన్‌లమధ్య ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏనుగులగుంపు రైలుపట్టాలను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, పొగమంచు కారణంగా డ్రైవర్‌లకు ఏనుగులు కనబడిఉండకపోవచ్చని బెర్హంపూర్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మిశ్రా చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన ఆరు ఏనుగులలో రెండు గున్న ఏనుగులుకూడా ఉన్నాయి. మరోవైపు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి రైలులో అటెండెంట్‌ అని తెలిసింది. అయితే అతను ఎలా చనిపోయాడనేది తెలియరాలేదు. ప్రమాదంకారణంగా రైలుకూడా దెబ్బతినడంతో అది అక్కడే కొంతకాలం నిలిచిపోవాల్సివచ్చింది. దీనితే కొన్నిగంటలపాటు బెర్హంపూర్‌, భువనేశ్వర్‌ స్టేషన్‌లమధ్య కొన్నిగంటలపాటు రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైలు సర్వీసులను పునరుద్ధరించడానికి ఎనిమిదిగంటల సమయం పట్టింది. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారంగురించి ఇంతకుముందే రైల్వే అధికారులకు తెలియజేశామని అటవీశాఖ అధికారులు చెప్పారు.

గుట్టుగా రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు


న్యూఢిల్లీ: సింగపూర్‌ మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచిన ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి ఆదివారం వేకువజామున హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. సాధారణ ప్రజలకు తెలియకుండానే ఈకార్యక్రమం ముగించేశారు. నగర అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె శవపేటిక వేకువజామున రాగానే నివాళులర్పించారు.

ఆమె చితికి వెక్కివెక్కి ఏడుస్తున్న తండ్రి నగరశివారులోని ద్వారక వద్ద ఉన్న దహనవాటిక వద్ద నిప్పంటించారు. రోదిస్తున్న బంధువులు మిత్రులు ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆఖరి వీడ్కోలు పలికారు. దక్షిణఢిల్లీలో ఆమె నివాసం ఉంది.

ఎయిరిండియా ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి మృతదేహం ఇక్కడకు వచ్చింది. ఆమెతో పాటు తల్లిదండ్రులు ఇద్దరు సోదరులున్నారు. విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు అలుముకుని ఉన్నది. జాతి మనోభావాలను ఇది ప్రతిబింబిస్తున్నట్లుంది. ఉదయం 3.30 గంటలకు విమానం ఇక్కడ దిగింది. సింగ్‌, సోనియాలు మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. తమ వేదనను వారితో పంచుకున్నారు. భారీ పోలీస్‌ బందోబస్త్‌ మధ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ కొన్ని అంత్యకార్యక్రమాలు జరిగాయి. తర్వాత ద్వారక సెక్టర్‌ 4 లోని దహనవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అంత్యక్రియలు జరిగేటపుడు ఢిల్లీ సిఎం షీలాదీక్షిత్‌, హోమ్‌ శాఖ సహాయమంత్రి ఆర్‌.పి.ఎన్‌.సింగ్‌ తదితర ముఖ్యులు అక్కడే ఉన్నారు. మీడియాను దగ్గరకు రానివ్వలేదు. శనివారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు దహన వాటిక వద్దకు వెళ్లి ఆదివారం వేకువజామున అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. ఇదీ చాలా రహస్యంగా.

తెల్లవారకుండానే దహనం చేద్దామనుకున్నారు. కాని అది వీలుకాలేదు. హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్యోదయం అయిన తర్వాతే అంత్యక్రియలు జరగాల్సి ఉంది. 7.30 గంటలకు మృతురాలి తండ్రి ఆమె సోదరుల సమక్షంలో చితికి నిప్పంటించారు.

దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విషాదం
రేప్‌ బాధితురాలి మృతితో సత్వర న్యాయం చేకూర్చాలని ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విషాదవాతావరణంలో ప్రార్ధనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. వివిధనగరాలలో విషాదం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆరుగురు నిందితులకు ఉరి విధించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉదయం నుంచి చీకటిపడేవరకు ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాలేజ్‌, స్కూల్‌ విద్యార్ధులు హైదరాబాద్‌,విజయవాడ, విశాఖ, కర్నూలు, వరంగల్‌ తదితర నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహిళాగ్రూపులు, యువజన సంఘాలు, వివిధ రాజకీయపార్టీల వారు ఈ ప్రదర్శనలలో పాల్గొని నినాదాలు చేశారు.

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చండీగఢ్‌, బెంగుళూరు, ముంబయిలలో జరిగిన ప్రదర్శనలకు భారీగా ప్రజలు హాజరయ్యారు.

మృతురాలి స్వస్థలమైన ఉత్తరాఖండ్‌ లోని గర్హ్‌వాల్‌లో ప్రజలు వారు వీరు అన్న భేదం లేకుండా ఇళ్లనుంచి బైటకు వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు.

అమితాబ్‌ హృదయావేదన
మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఢిల్లీ రేప్‌ మృతురాలికి గేయకవిత రూపంలో ఇలా నివాళి అర్పించారు. ఆమెను దామిని, అమానత్‌లుగా అభివర్ణించారు. ఆ కవిత ఇలా ఉంది.

కాలం గడుస్తున్న కొద్దీ కొవ్వొత్తులు కరగిపోతాయి మంటలు మరుగునపడతాయి
భక్తితో సమర్పించిన పూలు తేమలేమితో రాలిపోతాయి
నిరసన గళాలు మూగపోతాయి
కాని వెలిగించిన నిర్భయత్వ అగ్ని మా హృదయాలలో జ్వాలలను తిరిగి రగిలిస్తాయి
కన్నీటి తేమ రాలిపోయిన ఎండిపోయిన పూలు తిరిగి జీవవంతమవుతాయి
‘దామిని’ ‘అమానత్‌’ ఆత్మ గళం విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది
భారత్‌ నా మాతృదేశం
నాగురించి మరచిపోండి కాని మీ దేశపుత్రులుగా గుర్తింపు తెచ్చుకోండి.

‘బాధితురాలి’ మృతిపై మిల్కాసింగ్‌ కన్నీరు
పాతతరం భారత్‌ అథ్లెట్‌ మిల్కాసింగ్‌, ఢిల్లీ రేప్‌ బాధితురాలి మరణంపై కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. ఆమె మరణవార్త ఆయనను కలచివేసింది. బాధితురాలి కుటుంబానికి రూ.3 లక్షలు విరాళం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. 82 ఏళ్ల మిల్కాసింగ్‌ కొంతమంది పౌరులతో కలసి మృతురాలికి నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్‌ నుంచి ఆమె మృతదేహాన్ని శనివారం రాజధానికి తీసుకువచ్చారు. బాధితురాలి కుటుంబీకులు ఒంటరితనం అనుభూతి చెందనక్కరలేదు. వారి కుమార్తె మా కుమార్తెగా భావిస్తాం. ఇంకా చెప్పాలంటే ఆమె భారతదేశపు కుమార్తె. ఆమె లేని లోటు మాకు కూడా లోటే అని ఆయన అన్నారు. తన కుమారుడు జీవ్‌తో కలసి ఢిల్లీ వెళ్లి ప్రదర్శనలలో పాల్గొనాలని కోరుకున్నానని కాని తన భార్య నిర్మల్‌ కౌర్‌ అస్వస్థతతో ఉండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నానని చెప్పారు. సాహసవంతురాలైన ఆ యువతి మరణం దేశాన్ని కదలించింది. ఈ నేరానికి పాల్పడిన ఘోరనేరస్తులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ప్రభుత్వానికి రాస్తాను అని ఆయన అన్నారు. ఈ సంఘటనపై దిగ్భ్రాంతి చెందిన కొంతమంది మిత్రులు తనకు యుకె కెనడా యుఎస్‌ఎల నుంచి ఫోన్లు చేశారని ఆయన వెల్లడించారు. విదేశాలలో భారత్‌ ప్రతిష్ట దిగజారిందన్నారు.

ఢిల్లీలో ఐదుమెట్రోస్టేషన్‌ల పునఃప్రారంభం
సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలదృష్ట్యా నగరంలో నిరవధికంగా మూసేసిన 10 మెట్రో రైల్వే స్టేషన్‌లలో ఐదింటిని ఆదివారం మధ్యాహ్నం తెరిచారు. ఇండియా గేట్‌కు దారితీసే రాజ్‌పథ్‌, విజయ్‌చౌక్‌ మార్గాలలోమాత్రం ప్రజలను ఇంకా అనుమతించడంలేదు. ఈ మార్గాలలో వెళ్ళే పౌరులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించామని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు.

మరోవైపు నిరసన ప్రదర్శనలు జరుగుతున్న జంతర్‌మంతర్‌వద్ద ఆందోళనకారులకు, పోలీసులకుమధ్య ఆదివారం మధ్యాహ్నం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇండియాగేట్‌వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన నిరసనకారులు, పోలీసులు పెట్టిన బ్యారికేడ్‌లను విరగ్గొట్టడానికి విఫలయత్నంచేశారు.

పోలీసులతో ఎబివిపి కార్యకర్తల ఘర్షణ
న్యూఢిల్లీ నగరంలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదివారం ఎబివిపి కార్యకర్తలు పోలీసులతో ఘర్షణపడ్డారు. ఢిల్లీగ్యాంగ్‌ రేప్‌ మృతురాలికి సత్వర న్యాయంజరగాలని వారు ప్రదర్శనలు నిర్వహించిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. అప్పటివరకు శాంతియుతంగా జరిగిన ప్రదర్శన మధ్యాహ్నం 1.00 గంటకు హింసాత్మకంగా తయారైంది. ఎబివిపి కార్యకర్తలు పతాకాలు చేబూని కన్నాట్‌ ప్లేస్‌ వైపు ఊరేగింపుగా వెళుతుండగా పోలీసులు నిరోధి ంచారు. దాంతో అది ఘర్షణకు దారితీసింది. ఒక గ్రూపు శాంతియుతంగా ముందుకు పోగా మరో గ్రూపు బ్యారికేడ్లను ఛేదించేందుకు ప్రయత్నించింది. వారిని పోలీసులు వెనక్కు తరిమారు.

రేప్‌ నేర నిరోధానికి కాంగ్రెస్‌ బిల్లు
ఢిల్లీగ్యాంగ్‌ రేప్‌ బాధితురాలు మరణించటంతో కాంగ్రెస్‌ కఠినమైన చట్టాలను తీసుకురానుంది. అందులో రసాయనిక వృషణ నిర్వీర్యం (కెమికల్‌ కాస్ట్రేషన్‌) కూడా చేరి ఉంది. కాని కాంగ్రెస్‌ ముసాయిదా బిల్లు ఇంకా తయారు కాలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ కమిటీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి ఈ బిల్లును సమర్పించాల్సి ఉంది. అత్యాచార నిందితులకు అత్యధికంగా 30 సంవత్సరాల జైలు, కేసులవిచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు తదితర అంశాలు ఇందులో చేరి ఉన్నాయి. డిసెంబర్‌ 23న ఈ అంశాలను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో చర్చించారు. సోనియా నేతృత్వంలోని జాతీయ సలహామండలి ఇందులో ప్రమేయం చేసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం లాటి చట్టాలను ఈ మండలి రూపొందించింది. ఇక మహిళాశిశుసంక్షేమశాఖ మంత్రి కృష్ణతీర్ధ్‌ నేతృత్వంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. తమకు అందిన సలహాలను సూచనలను ఈ శాఖ జస్టిస్‌ వర్మ కమిటీకి సమర్పిస్తుంది.

వరంగల్‌లో జిల్లాలో జోరుగా చంద్రబాబు యాత్ర


వరంగల్‌: న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ అనంతరం తన యాత్రకు వస్తున్న స్పందనతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవటంతో పాటుగా తమ పార్టీ 42 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న పక్షంలో వంట గ్యాస్‌ సిలిండర్లను రాయితీపై అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్‌ జిల్లాలో ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర రెండవ రోజైన ఆదివారంనాడు వరంగల్‌ జిల్లాలో నవాబ్‌ పేట వద్ద ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తాను పాదయాత్ర చేస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు లాంటి వరంగల్‌లో టిడిపి అధినేత స్వేచ్ఛగా సంచరిస్తున్నట్టుగా కనిపించారు. అఖిలపక్ష సమావేశంలో పార్టీ తెలిపిన ఏకాభిప్రాయంతో నాయుడు, ఆయన పార్టీ నేతలకు తెలంగాణ ప్రాంతంలో అడ్డంకులు తొలగిపోయాయి. ఒకానొక దశలో ఫోటో జర్నలిస్టుల నుంచి కెమెరా తీసుకున్న టిడిపి అధినేత కెమెరాను క్లిక్‌మని అనిపించటంతో పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. చంద్రబాబునాయుడు ఆదివారం నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలైన చిట్యాల మండలంలో సుబ్బక్కపల్లి, నవాబ్‌ పేట, మొగుళ్లపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. పోలీసు భద్రత నడుమ నాయుడు యాత్ర సాగుతున్నప్పటికీ మాదిగ విద్యార్ధి సంఘం, తెలుగునాడు విద్యార్థి సంఘం కార్యకర్తలు వరంగల్‌లో యాత్ర ఆసాంతం టిడిపి అధినేతకు రక్షాకవచంగా నిలిచారు. తొలుత శనివారం రాత్రి బసచేసిన సుబ్బక్కపల్లి నుంచి చంద్రబాబు ఆదివారం తన యాత్ర ప్రారంభించారు. ప్రజాసంఘాల జేఎసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం, ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఎసీ ఛైర్మన్‌ రాజారామ్‌ యాదవ్‌లు టిడిపి అధినేతను కలుసుకున్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రాజకీయ సమీకరణాలు క్రమక్రమంగా తమకు అనుకూలంగా మారుతుండటం పట్ల టిడిపి శ్రేణులు సంతోషంగా ఉన్నాయి.

గోపీనాథ్‌ కంపెనీపై కింగ్‌ ఫిషర్‌ పైలట్ల ఆశ


ముంబయి: డెక్కన్‌ ఎయిర్‌ లైన్స్‌ మాజీ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాధ్‌ కొత్తగా మరో కంపెనీ పెడుతున్నట్లు వార్తలు రావటంతో సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగులు ఆరాలు తీస్తున్నారు. వీరిని జెట్‌ ఎయిర్‌ వేస్‌, స్పైస్‌ జెట్‌, ఇండిగో లాటి కంపెనీలు ఉద్యోగాలలోనికి తీసుకోవటం లేదు. ఇంతవరకు వీరికి 8 నెలల నుంచి జీతాలు రాలేదు. ఇపుడు గోపీనాథ్‌ కంపెనీపై వారు ఆశలు పెట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కొంతమంది పైలట్లు గోపీనాథ్‌ను ఇప్పటికే సంప్రదించారు. మరికొంత మందికి మాత్రం కింగ్‌ ఫిషర్‌ పునరుద్ధరణ జరుగుతుందని ఆశలున్నాయి. విజయ్‌ మల్యా విదేశీ భాగస్వామి సంయుక్త భాగస్వామ్యంతో తన కంపెనీని నడపాలని వార్తలు వచ్చిన నేపధ్యంలో ప్రస్తుత ఉద్యోగులలో కొంతమంది అది నిజమవుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. అయితే మరికొంతమందికి ఈ వాదన రుచించటం లేదు. సమీప భవిష్యత్తులో కింగ్‌ ఫిషర్‌ పునరుద్ధరణ జరుగుతుందని తాము భావించటం లేదని ఒకవేళ అలా జరిగినప్పటికీ చాలా తక్కువస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించవచ్చని పేరు చెప్పని కొంతమంది పైలట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కింగ్‌ ఫిషర్‌ సిఇఓ సంజయ్‌ అగర్వాల్‌ తమ సిబ్బందికి వేతనాలిస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఆచరణలో అలా జరుగలేదు. దీపావళిన మే నెల వేతనం చెల్లిస్తామని చెప్పి వాగ్దానభంగానికి పాల్పడ్డారు. ఇప్పటివరకు మే నెల జీతాలు అందలేదని పైలట్లు చెప్పారు.

2013లో బంగారం ధర పదిగ్రాములు రూ.33,000


ముంబయి: బంగారం ధర 2013లో పదిగ్రాములు రూ.33,000 వద్ద స్థిరపడవచ్చని ప్రముఖ ఆర్ధికవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక ప్రగతి అవకాశాల మెరుగుదల, కొన్ని అంతర్జాతీయ అంశాలు పచ్చలోహం ధర పెరుగుదలకు కారణభూతమవుతాయని కోటక్‌ కమాడిటీ సర్వీసెస్‌ విశ్లేషకురాలు మాధవిమెహతా పేర్కొన్నారు. పలుదేశాల కేంద్రీయ బ్యాంకులలో బంగారం స్థాయి స్థిరంగా ఉంది. మార్కెట్లలో ద్రవ్యప్రవాహం అందువల్ల అధికమవుతుంది. ఇది బంగారం నిల్వలు పెంచుకునేందుకు కారణమవుతుంది అని ఆమె చెప్పారు. బ్రాజిల్‌, రష్యా కేంద్రీయ బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు ఆమె తెలిపారు. అందువల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.28,000-33,000 మధ్య స్థిరపడవచ్చని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాని రూపాయి పతనం, ఆర్ధికమాంద్యం బంగారం ధరపై ప్రభావం చూపవచ్చని అన్నారు. ఇది బేరిష్‌ ధోరణిలో ఉండవచ్చన్నారు. వస్తువు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నపుడు విక్రయాలు చేసి అదే వస్తువు ధర పడిపోయినపుడు కొనుగోలు చేయటం బేరిష్‌ ధోరణిగా స్టాక్‌ మార్కెట్‌లో పారిభాషికపదంగా వినియోగిస్తారు. ఇక విదేశీసంస్థాగత ఇన్వెస్టర్‌లు(ఎఫ్‌ఎఫ్‌ఐ)లు కూడా ఈక్విటీమార్కెట్లో పెట్టుబడులు అధికంగా పెట్టుబడి పెట్టినట్లయితే అది కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతుందని చెప్పారు. గత వారం మార్కెట్‌లో బంగారం ధర దేశీయమార్కెట్‌లో 10 గ్రాములు రూ.30,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు 1658 డాలర్లు పలికింది.