జీరో సైజులో సంజన సంతోషం!


”కన్నడ రంగానికి చెందిన ఏ తారకైనా ఆ కోరిక ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది” అంటోంది బెంగళూరు బ్యూటీ సంజన. ఇంతకీ ఆ కోరిక ఏమిటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. కన్నడ రంగంలో డాక్టర్ రాజ్‌కుమార్‌కి నటుడిగా ఓ విశిష్టమైన స్థానం ఉంది. పాత తరం నాయికలు ఎంతోమంది రాజ్‌కుమార్‌ సరసన జతకట్టారు. నేటి తరం నాయికల్లో చాలామంది రాజ్‌కుమార్‌ తనయుల సరసన సినిమా చేయడం తమ అదృష్టంగా భావిస్తారు.

అలా అనుకునే వారిలో సంజన ఒకరు. కన్నడ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ సరసన ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి చెబుతూ ”కన్నడంలో రాజ్‌కుమార్‌గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన తనయుడి సరసన నటించాలనే నా కోరిక తీరడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మడు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించి అలరించబోతున్నానంటూ సెలవిచ్చింది. ఈ మధ్యకాలంలో ‘జీరో సైజ్‌’ ట్రెండ్‌ నడుస్తోంది కదా.

బహుశా ఆ ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో సంజన జీరో సైజ్‌కు మారినట్లుంది. ఈ కొత్త లుక్‌ అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. శివరాజ్‌కుమార్‌ సరసన చేస్తున్న సినిమా కాకుండా ఆమె రవీంద్ర దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా చేస్తున్నారు. మలయాళంలో అంగీక రించిన చిత్రం షూటింగ్‌ జూన్‌లో ఆరంభం కానుంది. కేరళలో ఇది ఆమెకు తొలి చిత్రం. తెలుగులో కూడా అవకాశాలు ఉన్నాయని, అధికారికంగా ఒప్పందం కుదిరిన తర్వాత ఆ చిత్రాల గురించి చెబుతానని సంజనా అన్నారు.

సినీ వాణిజ్యంలో మనదే సింహభాగం!


భారతదేశంలో జరుగుతున్న మొత్తం సినీ వాణిజ్యంలో సింహభాగం దక్షిణాదిదే. ఈ నిజాన్ని అంగీకరించడానికి బాలీవుడ్ వాణిజ్య వర్గాలు అంగీకరించవేమో గానీ, వాస్తవంలో మాత్రం దీన్ని ఎవరూ కాదనలేరు. దేశంలోని మొత్తం సినీ పరిశ్రమ ఆదాయంలో నాలుగింట మూడొంతుల వాటా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలదే. 2008-09లో ఈ నాలుగు దక్షిణాది భాషా చిత్రాలు రూ.1,700కోట్ల పైగా ఆదాయం ఆర్జించాయి. సాధారణంగా దక్షిణాది చిత్రాల మొత్తం ఆదాయాల్లో తెలుగు, తమిళ సినిమాల వాటా చెరి 45శాతం, మలయాళం 8శాతం, కన్నడ చిత్రాల భాగం సుమారు 2శాతం వుంటోంది.

మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ నిర్మించే చిత్రాల కన్నా తెలుగులో తయారయ్యే సినిమాలే అత్యధికం. ఎర్న్ స్ట్ అండ్ యంగ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ డౌన్ సౌత్ సంస్థలు కలిసి తయారుచేసిన నివేదిక ప్రకారం గత ఏడాది 230 తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఇక దేశంలోని థియేటర్లలో సగభాగం దక్షిణాదిలోనే వున్నాయి.

దక్షిణాదిన సినిమాల నిర్మాణం స్ర్కిప్ట్ నుంచి స్ర్కీన్ దాకా ఓ క్రమశిక్షణతో సాగిపోతుంది. గడిచిన అయిదేళ్ళుగా దక్షినాది చిత్రాలు ఓ రకంగా భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలు, యానిమేషన్, స్పెషల్ ఎఫెక్ట్ లు ఉపయోగించుకోవడంలోనూ సౌత్ సినీ ఇండస్ట్రీ ముందుంటోంది.

ఆస్కార్ను అందుకున్న ఎ.ఆర్.రెహమన్, రసూల్ పొకుట్టి కూడా దక్షిణాది వారే. సౌత్ సినిమాలంటే రజనీకాంత్ స్టయిల్స్, క్విక్ గన్ మురుగన్ తరహా పాత్రలేనని మిగతా ప్రాంతాల వారు అనుకున్నా బాక్సాఫీసు దగ్గర కాసులు రాబట్టుకోవడంలో ఈ చిత్రాలే ముందుంటున్నాయి.

సినిమా విడుదల హక్కులను పరిశ్రమ గట్టిగా నియంత్రించడం దక్షిణాది చిత్రాల విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎర్న్ స్ట్ అండ్ యంగ్ కి చెందిన ఫారుఖ్ బర్సాలా అభిప్రాయపడ్డారు. పైరసీ సంగతి పక్కనపెడితే సినిమా విడుదలైన ఏడాది దాకా టీవీల్లో ప్రసారం కాకుండా జాగ్రత్త పడతాయి కాబట్టి థియేటర్ల కలెక్షన్లు ఎక్కువగా వుంటాయని ఆయన విశ్లేషించారు.

2008-09లో వచ్చిన రూ.1,700కోట్ల ఆదాయంలో రూ.1,300కోట్లు దేశీయంగా థియేటర్ల కలెక్షన్ల ద్వారానే రావడం దీనికి ఊతమిస్తోంది. దక్షిణాది పరిశ్రమ వ్యాపార ధోరణిని కూడా మార్చుకుంది. కోటి, రెండు, మూడు కోట్ల బడ్జెట్ సినిమాలనుంచి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ ప్రభావం కలెక్షన్లమీద కూడా కనిపిస్తోంది. రూ.7కోట్లపైగా బడ్జెట్ తో తీసిన సినిమాలపై ఆదాయం గతంలో 45శాతం దాకా వుండగా, ప్రస్తుతం 65శాతం వుంటోంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పంపిణీ తక్కువే అయినా, ఈ సినిమాలు దక్షిణాదిలోని పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లనే సాధించుకోగలుగుతున్నాయి.

తమిళ సినిమాల ఆదాయంలో నాలుగోవంతు పొరుగు రాష్ట్రాల నుంచే వుంటోంది.

దక్షిణాది సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆదరణ దక్కించుకోగలిగే సామర్థ్యం వుందని బల్సారా చెప్పారు. అయితే, థియేటర్ కలెక్షన్ల విషయంలో పారదర్శకత లేకపోవడం, తరచూ టికెట్ ధరలు పెంచడం అడ్డంకులని ఆయన అభిప్రాయపడ్డారు. సెన్సార్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత కూడా వివిధ కారణాల వల్ల 35శాతం సినిమాలు విడుదల కావన్నారు. దీనికితోడు తారల పారితోషికం ఆకాశాన్నంటుతుండడంతో బడ్జెట్ లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

పి.టి.నాయుడు.

భవిష్యత్తుపై ఆశతో…: జెనీలియా


అల్లరి పిల్లగా అందరినీ ఆకట్టుకుని దర్శక, నిర్మాతలకు కాసులు కురిపించిన ‘బొమ్మరిల్లు’ ముద్దుగుమ్మ జెనీలియా ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తును ఊహించుకుంటోంది. కెరీర్‌ ఆరంభంలో పూర్తి స్థాయి మాస్‌ మసాలా చిత్రాల్లో చేసిన ఈ అమ్మడు తర్వాత తర్వాత బొమ్మరిల్లు తరహా క్లాస్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఆ చిత్రాలు తన కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడవని ఆలస్యంగా తెలుసుకున్న జెనీలియా బొమ్మరిల్లుతో తన పంథాను మార్చుకుంది. భవిష్యత్తు ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో ‘బొమ్మరిల్లు’ అవకాశం వచ్చిందని చెబుతున్న ఈ అమ్మడు ఆ సినిమాయే తన సినీ జీవితానికి మేలిమలుపు అయ్యిందని పేర్కొంటోంది. ఆ చిత్రం తమిళ, కన్నడ, హిందీ రీమేక్స్‌లో కూడా తనే నటించి ఆయా భాషల్లో కూడా ప్రత్యేకతను చాటుకుంది. ”ఒకే పాత్రను నాలుగు భాషల్లో చేయడం అరుదుగా జరుగుతుంది. ఆ అవకాశం నన్ను వరించింది. ‘రెడీ’ సినిమా విషయంలో కూడా ఇలా జరుగుతోంది. ఈ చిత్రం తమిళ రీమేక్‌ ‘ఉత్తమ పుత్తిరన్‌’లో కూడా నేనే కథానాయికగా నటిస్తున్నాను” అని జెనీలియా చెప్పారు.

”అంగాంగ ప్రదర్శనకు వీలైనంత దూరంగా ఉండాలని మొదటిసారి మేకప్‌ వేసుకున్నప్పుడు నేను ఫిక్స్‌ అయ్యాను. లక్కీగా నన్నెవరూ అలాంటి పాత్రలకు అడగడంలేదు. ఓ కాలేజ్‌ గాళ్‌ ఎలా ఉంటుందో సినిమాల్లో నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. దాంతో అందరూ నన్ను తమ అమ్మాయిలా భావిస్తున్నారు. ఎక్స్‌పోజింగ్‌తో నెట్టుకొచ్చేకన్నా చక్కని అభినయం కనబర్చి మంచి పేరు తెచ్చుకోవాలన్న నా కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.

ఒకానొక దశలో నేను యంగ్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తాననే ప్రచారం జరిగింది. ఆ వార్తలు విని కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే ఓ సినిమాకి సైన్‌ చేసే ముందు నా పాత్ర బాగుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. హీరో గురించి అస్సలు ఆలోచించను. సీనియర్‌ హీరోల పక్కన నటించినప్పుడు వారి అనుభవం నాకు హెల్ప్‌ అవుతుంది కాబట్టి వారి పక్కన నటించడానికి నాకభ్యంతరం లేదు. అలాగే కథ నచ్చితే చాలు నా పాత్ర నిడివి ఐదు నిముషాలు ఉన్నా సరే ఒప్పేసుకుంటాను” అని అంటోంది.

”నేనెప్పుడూ ఏదీ ప్లాన్‌ చేయలేదు. ఫలానా సినిమా చేయాలని టార్గెట్‌ పెట్టుకుని సినిమాలు చేయలేదు. వచ్చిన అవకాశాలను ఒప్పుకున్నాను. కాకపోతే ఒకసారి మాత్రం ప్లాన్‌ చేశాను. ‘జానే తు య…’కి ముందు బాలీవుడ్‌లో నా కెరీర్‌ సరిగ్గా సాగలేదు. అప్పుడు మాత్రం దక్షిణాది చిత్రాలు చేయాలని ప్లాన్‌ చేసుకున్నాను. ఇప్పుడు ప్లానింగ్‌ ఏదీ లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ చేస్తాను. కాకపోతే నన్ను తెలుగు పరిశ్రమ దాదాపు ఏడేళ్లుగా భరిస్తోంది (నవ్వుతూ). అందుకని తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తాను.

జీవితంలో ఊహించని మలుపు ఎదురైనప్పుడు ఇది కలా? నిజమా? అనిపిస్తుంది. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం ఆ సంఘటన జరిగిప్పుడు నాకు అలానే అనిపించింది. అప్పుడు నేనెవర్నో ఎవరికీ తెలియదు. ఓ సాదాసీదా అమ్మాయిని. ఓ పెళ్లిలో స్నేహితులతో సరదాగా కబుర్లాడాను. మేమంతా గోల గోల చేశాం. దాంతో నలుగురి దృష్టిలో పడిపోయాను. ఫలితంగా నా జీవితం మారిపోయింది. యాడ్‌లో నటిస్తావా? అంటూ ఆహ్వానం అందింది. ట్రై చేద్దామనుకుని వెళ్లా. ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ సరసన నటించబోతున్నానని తెలిసి షాకయ్యా. ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. ఆ యాడ్‌ సినిమా రంగంలో నా రంగప్రవేశానికి నాంది పలికింది. ఆనాడు అమితాబ్‌ నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ సినిమా కోసం నేను ఫిలింఫేర్‌ అవార్డ్‌ అందుకున్నప్పుడు ఆ వేదిక మీద ఆయన ఉన్నారు. నేను యాక్ట్‌ చేసిన హిందీ చిత్రం ‘జానే తు య జానే న’ ప్రీమియర్‌ షోలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత తన బ్లాగ్‌లో ఆయన నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. వయసులో, అనుభవంలో చిన్నదాన్నయిన నేను ఆయన అభినందనలు అందుకోగలిగాను” అని జెనీలియా చెప్పుకొచ్చింది.

”బేసిక్‌గా నేను అథ్లెట్‌ని. జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ ఆడాను. నేను స్టేట్‌ లెవల్‌ రన్నర్‌ని. నా శరీరాకృతి కరెక్ట్‌గా ఉండటానికి క్రీడలే కారణం. నూనె వంటకాలు, పిజ్జాలు, బర్గర్‌లు ఇలా అన్నీ లాగించేస్తాను. అయినా బరువు పెరగకపోవడానికి వర్కవుట్లే కారణం.

సినిమా తప్ప నాకు వేరే దేని మీదా ఆసక్తి లేదు. ఆరంభంలో నా కెరీర్‌ ఆశించినంతగా సాగలేదు. అయినా నేను నిరుత్సాహపడలేదు. కష్టపడేవాళ్లని దేవుడు ఆదుకుంటాడనే నమ్మకంతో ఉండేదాన్ని. ఆ నమ్మకం వృధా కాలేదు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో నిరూపించుకున్నాను. మొత్తం మూడు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను” అని నవ్వుతూ చెప్పే ఈ ముద్దుగుమ్మ మనసులో ప్రేమ చిగురించినట్లు ఇటీవలే మీడియాలో కూడా వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందించేందుకు మాత్రం జెనీలియా ససేమీరా అంది.

ఆకట్టుకునే కథాంశంతో పనేముంది?


చాలా రోజుల విరామం తర్వాత అన్నట్లు నందమూరి బాలకృష్ణ చిత్రం విడుదలయింది. ఆయన గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో కాకపోయినా, తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంగా చేసిన ‘సింహా’పై ఆయన అభిమానులే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా భారీ ఆశలే పెట్టుకుంది. సమరసింహారెడ్డి అంతటి భారీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని బోయపాటి ఈ చిత్రాన్ని రూపించినట్లు సినిమా ఆశాంతం చూసిన వారికి అర్ధమవుతుంది. ద్విపాత్రాభినయంలో బాలయ్య తన విశ్వరూపాన్ని ‘సింహా’ ద్వారా మరోమారు చూపించారు.

ఆదర్శ భావాలున్న శ్రీమన్నారాయణ ఓ కాలేజీలో ప్రొఫెసర్. జానకి అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆమెకు దగ్గరవుతాడు. ఓ ముఠా ఆమెను ఎత్తుకుపోవాలని చూస్తుంటే, ఆమె తండ్రి కూడా అదే సమయంలో అక్కడికి వస్తాడు. ఆ ఘర్షణలో శ్రీమన్నారాయణ బామ్మ గాయపడుతుంది. ఆ సందర్భంలో- తన తండ్రి నరసింహ గురించి శ్రీమన్నారాయణ తెలుసుకుంటాడు. జమిందారీ కుటుంబంలో పుట్టి, వైద్య వృత్తి చేస్తున్న నరసింహ ప్రజాకంటకులుగా మారిన వీరకేశవులు ముఠాను మట్టుపెడుతుంటాడు. వీరకేశవులు పన్నిన కుట్రలో నరసింహ భార్యా సమేతంగా మరణిస్తాడు. ఈ విషయాన్ని బామ్మ నుండి తెలుసుకున్న శ్రీమన్నారాయణ, తండ్రి తలపెట్టిన పని ఎలా పూర్తి చేశాడనేదే ఈ చిత్ర కథాంశం.

బాలకృష్ణ అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుందీ చిత్రం. గతంలో బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ చిత్రాలను మళ్ళీ చూసినట్లుంటుంది. ఏమాత్రం కొత్తదనం కనబడదు. నేపథ్యం రాయలసీమ అనే బదులు బొబ్బిలి అని మార్చారు. యాక్షన్ అంటే ఇష్టపడే బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో చేసిన ఈ చిత్రంలో మరింత రెచ్చిపోయాడు. సగానికిపైగా సినిమా ఈ హింసతోనే నిండిపోయింది. ఇటువంటి సన్నివేశాలను ప్రేక్షకులపైకి ఎలా వదిలేసారో సెన్సార్ వారికే తెలియాలి.

నరసింహ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్. హీరో విలన్ల కారు ఛేజ్, నరసింహ పరిచయం, విలన్ తో హీరో హాస్పిటల్ సీన్, పోలీస్ స్టేషన్లో కమిషనర్ తో సన్నివేశం బాగున్నాయి. హీరో హీరోయిన్ల వ్రతం రొమాంటిక్ సీన్, నరసింహను తల్లి సమర్థించే సన్నివేశం, పోలీసు అధికారితో నయనతార వాగ్వాదం బాగున్నాయి. నరసింహ చనిపోయే పోరాట సన్నివేశం చాలా బాగుంది.

దీనికి ‘మగధీర’ పోలికలున్నాయి. ఫ్లాష్ బ్యాక్లో హీరోహీరోయిన్ల గెటప్లు బాగున్నాయి. అలాగే సంభాషణలు కూడా బాగున్నాయి. ”చరిత్ర సృష్టించాలన్నా… చరిత్ర తిరగరాయాలన్నా మాకే చెల్లింది” అంటూ నందమూరి అభిమానులను అలరించే డైలాగులు కూడా వున్నాయి.

నరసింహగా, శ్రీమన్నారాయణగా రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ చేసారు.

ప్రధానంగా, నరసింహ పాత్ర మూమెంట్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. జమిందారు, వైద్యుడు, అన్యాయాన్ని అంతమొందించే వ్యక్తిగా మూడు రకాల షేడ్స్ను చక్కగా చూపించాడు. అయితే ఫైట్స్లో రాణించినంతగా డాన్స్లు చేయలేకపోయాడు. పైగా శ్రీమన్నారాయణ గెటప్లో గ్లామర్ కొరవడింది. ప్రొఫెసర్ అయ్యుండి చొక్కా గుండీలు విప్పుకుని తిరగడం, అమ్మాయిల భుజాలు చరవడం బాగులేదు.

చిన్న పాత్ర అయినా, నరసింహ భార్యగా నయనతార బాగా చేసింది. నమిత తన పాత్రకు మరీ ఎక్కువ అయిపోతే, స్నేహా ఉల్లాల్ మరీ తక్కువ అయిపోయింది. నమితను చూడటానికి రెండు కళ్ళూ చాలకపోగా, స్నేహా ఉల్లాల్ మొహంలో కనీస హావభావాలు కూడా పలకలేదు. బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, ధర్మవరపు, అలీల కామెడీ పండలేదు. వున్నంతలో ఝాన్సీ బెటర్. ఇతర పాత్రలు కె.ఆర్.విజయ, రెహమాన్, కిన్నెర, కోట, చలపతిరావు, డా. రవిప్రకాష్, సాయికుమార్, ఆనందభారతి పోషించారు.

చక్రి పాటలు రెగ్యులర్ కమర్షియల్ పద్ధతిలోనే సాగాయి. చిత్రీకరణ కూడా అంతే. చిన్న బ్యాక్ గ్రౌండ్ సంగీతం, విల్సన్ ఫొటోగ్రఫీ, కోటగిరి ఎడిటింగ్ బాగున్నాయి. యునైటెడ్ మూవీస్ సమర్పణలో బోయపాటి శ్రీను కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి బాలయ్య తాజా చిత్రం ఆయన అభిమానులనే కాకుండా సినీ ప్రియులను ఆకట్టుకునేలానే ఉంది. విమర్శకులు సైతం బాలయ్య ‘సింహ’రూపాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.

ఇ.శివలక్ష్మి.