విశాఖపట్నం: జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేని అయిదు వందలకు పైగా పాఠశాలలపై జిల్లా విద్యా శాఖ ఆధ్వర్వంలో సంబంధిత పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ చట్టం (1982), సవరించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చట్టం(1987) ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయా మండలాలలో ఎంఇవోల ఆధ్వర్వంలో సమీప పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా వేయికి పైగా ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయి. అయితే, అధికారులవద్ద ఉన్న రికార్డుల ప్రకారం 486 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. వీటికి తోడుగా మరొక యాభై వరకూ కొత్త పాఠశాలలను గుర్తించినట్లుగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
అయితే, అరవై వరకూ పాఠశాలలు తమకు తామే స్వచ్ఛందంగా మూసివేయడంతో అధికారులకు చర్యలు తీసుకునే శ్రమ తప్పింది. మిగిలిన 500 వరకూ పాఠశాలలపై గురువారం సాయంత్రానికి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా జిల్లాలోని అనేక మండలాలలో మండల రిసోర్స్ పర్సన్స్ సర్వే చేసి మరీ గుర్తింపు లేని పాఠశాలలను కనుగొన్నారు. కొన్నింటికి బోర్డులు తీసేసి మరీ నిర్వాహకులు జాగ్రత్తపడగా, మరికొన్ని పాఠశాలలు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులకు సెలవులను ప్రకటించాయి. ఈ విధంగా నోటీసులకు చిక్కకుండా అరవై వరకూ పాఠశాలలు ఉండగా, మిగిలిన వాటిని గుర్తించి నోటీసులను ఎంఆర్పీలు అందచేశారు.
చాలా చోట్ల ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు గుర్తింపు కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, తమకు మరికొంత గడువు కావాలని అభ్యర్ధించారు. అయితే, ఇది హైకోర్టు తీర్పు మేరకు చేపడుతున్న చర్యని అందువల్ల తమకు ఏమీ అవకాశం లేదని తేల్చి చెప్పి మరీ నోటీసులు అందచేశారు. మొత్తం అయిదు వందలకు పైగా పాఠశాలలతో పాటు, ఇంకా వందల సంఖ్యలో నడుస్తున్న అనధికార పాఠశాలలన్నీ శుక్రవారం నుంచి తెరవరాదని నోటీసులో స్పష్టం చేశారు. ఆ విధంగా తెరిచే పాఠశాలలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ ఆయా పాఠశాలల చిరునామా, నిర్వాహకుల పేర్లు పాఠశాలల పేర్లతో సహా, ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, నగరంలోనే అధిక సంఖ్యలో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కార్పొరేట్ సంస్థల పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలు ఒక చిరునామాకు మాత్రమే గుర్తింపును పొంది మిగిలిన శాఖలను నిర్భయంగా కొనసాగిస్తున్నాయి. ఈ తరహా పాఠశాలలకు మాత్రం జిల్లా విద్యాశాఖ మినహాయింపు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, వీటికి నోటీసులను అందచేయకుండా సర్దుబాటు చేశారనీ చెబుతున్నారు. మొత్తం మీద అన్ని గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తప్పవని మాత్రం అధికారులు పేర్కొనడం విశేషం. ఇంకొకవైపు ఈ పాఠశాలలలో చదువుతున్న అరవై నుంచి డెబె్బై వేల మంది వరకూ విద్యార్థులు, నాలుగు వేల మంది వరకూ ఉపాధ్యాయుల భవిష్యత్తు అంధకారంలో పడింది.
నెలకు రెండు నుంచి మూడు వేల వరకూ జీతాలను అందుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరుద్యోగులైన ప్రైవేటు టీచర్లు హైకోర్టు తీర్పుతో షాక్ తిన్నారు. అదే సమయంలో తమ పిల్లలను మంచి పాఠశాలలలో చదివిస్తున్నామని ఇన్నాళ్లుగా ఆనందంగా ఉన్న తల్లిదండ్రులు సైతం విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలలు మూతపడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకూ తమ పిల్లలు చదివే పాఠశాలలకు గుర్తింపు లేదన్న సంగతి తెలియనే తెలియదని అంటున్నారు. మొత్తం ఏడాది ఫీజులను ఒకేసారి కట్టేసిన తమకు ఈ శిక్ష ఏమిటని వాపోతున్నారు. కోర్టు తీర్పు, ప్రభుత్వ నిబంధనల సంగతి అలా ఉంచితే తమ బిడ్డల భవిష్యత్తును పాడుచేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
నేడు సర్కార్కు నివేదిక
ఇదిలా ఉండగా, జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న క్రిమినల్ చర్యల గురించి ప్రభుత్వానికి నివేదికను జిల్లా విద్యాశాఖ పంపించనుంది. ఈ విషయమై పాఠశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎస్ జగన్నాధరెడ్డి మాట్లాడుతూ, తాము గుర్తింపు లేని పాఠశాలలన్నింటికీ నోటీసులను అందచేశాం, ఇది లాంఛనప్రాయమని, నోటీసులు ఇవ్వకపోయినా అనధికారికంగా నడిపే ఏ పాఠశాలపైనైనా శుక్రవారం నుంచి చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ విషయంలో విద్యా శాఖ చట్టం ప్రకారం కేసులు ఉంటాయని తెలిపారు. ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహించినట్లైతే వాటిని తక్షణం మూసివేయాలని ఆయన ఆదేశించారు.
Filed under: వార్తలు | Tagged: విద్య, విశాఖపట్నం | Leave a comment »