హైదరాబాద్: చాపకింద నీరులా మావోయిస్టులు రాష్ట్రంలో తమ నెట్వర్క్ను, ఇటు క్యాడర్ను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 చర్చల తర్వాత వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతలు ఎన్కౌంటర్లో హతమవడం… మరికొందరు నేతలు లొంగిపోవడంతో ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీతో పాటు నల్లమల, దండకారణ్యం పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. ఇటీవలే ఛత్తీస్ గఢ్లో పోలీసులపై గెరిల్లా యుద్ధతంత్రంతో విజ యాన్ని సాధించిన మావోయిస్టులు తిరిగి రాష్ట్రంలో పాగా వేసేందుకు యత్నాలను ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
గతంలో అగ్ర నేతలు శాఖమూరి అప్పారావు, టెక్ రమణ అలి యాస్ కొండల్రెడ్డి ఎన్కౌంటర్ సమయంలో వారి డైరీని డీకోడ్ చేసినప్పుడు మావోల వ్యూహాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రముఖులను టార్గెట్ చేసేందుకే వారు వచ్చినట్లు డీజీపీ స్వయంగా పేర్కొన్నారు. మావోయిస్టులు ఉత్తర తెలం గాణా స్పెషల్ జోన్పై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. చాలా వరకు గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఆ తర్వాత లొంగిపోయినవారు.. మావోయిస్టు సానుభూతిపరులుగా పోలీసు శాఖకు చిక్కకుండా పనిచేసిన యువత ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న వారు…. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలైనవారు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యులుగా చేరుతున్నట్లు తెలుస్తోంది.
దండకారణ్యం… అబూజ్మఢ్ కొండల్లో వీరికి శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉత్తర తెలంగాణాలో జిల్లాల వారీగా, మండలాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జి రామన్న ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉత్తర తెలంగాణాలోని నల్గొండలో కొంతభాగం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణాలో గతంలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేసిన సికాస గట్టిపడుతున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు సైతం అప్రమత్తం చేస్తున్నాయి.
నల్లమలలో ఉనికే లేదు…
అగ్రనేతలు బాలకృష్ణ, సుధాకర్ ఎన్కౌంటర్, ఉయ్యూరు ఎన్కౌంటర్ తర్వాత నల్లమలలో మావో యిస్టుల ఉనికి లేకుండా పోయిందనేది స్పష్టమవు తోంది. అదే సమయంలో పోలీసు వర్గాలు సైతం ఉత్తర తెలంగాణా, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో మాత్రమే మావోయిస్టుల కదలికలు స్పష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. దండకారణ్యం, నల్లమల కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టులు పేట్రేగిపోయి దాడులకు దిగుతు న్నారు. గతంలో మావోయిస్టులకు బలంగా ఉన్న ఉత్తర తెలంగాణాలో పార్టీ పుంజుకుంటేనే తిరిగి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉండటంతో అగ్రనేతలంతా ఉత్తర తెలంగాణాపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఆరు సంవత్సరాలుగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళిన అగ్రనేతలు సైతం రాష్ట్రం పైనే ప్రధానంగా గురిపెట్టి వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
దండకారణ్యం ద్వారా ప్రవేశం
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఉన్న దండకార ణ్యం ద్వారా మావోయిస్టు వర్గాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పేట్రేగిపోయి సాయుధ బలగాలపై దాడులకు దిగుతున్న నేపథ్యంలో… రాష్ట్ర పోలీసులు ఛత్తీస్గఢ్ – ఆంధ్రా సరిహద్దుపై భద్రతా దళాలు, గ్రేహౌండ్స్ బలగాలు పెద్దయెత్తున మోహరించడం… ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుపై పోలీసుల నిఘా తక్కువగా ఉండటం… సులువుగా ప్రవేశించే అవకాశం ఉండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Filed under: వార్తలు | Tagged: అగ్రనేతలు, ఎన్కౌంటర్లు, క్యాడర్, ఛత్తీస్గఢ్, దండకారణ్యం, నెట్వర్క్, మావోయిస్టులు, రాష్ట్రం, హైదరాబాద్ | Leave a comment »