నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మరణానంతరం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు జిల్లా అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాటినుంచి ఈరోజు వరకు అభివృద్ధి పనులపై ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం కొన్ని సమీక్షలను నిర్వహించినప్పటికీ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏదో చేయాలన్న భావనతో నిర్వహించారే తప్ప సంబంధిత పథకాల అమలు ఎలా అనే అంశం జిల్లా యంత్రాంగాన్ని వెంటాడుతోంది. దీనికితోడు ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బిజిగా ఉండడంతో ఒక్కసారిగా జిల్లా అభివృద్ధిలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. కలెక్టర్లు, ఇతర శాఖాధికారులు తాము నామమాత్రంగా చేయాలే తప్ప ఏ పనికి ఏది అవసరమో అన్న విషయాన్ని పట్టించుకోకుండా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని 44 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఆ దిశగ నష్ట నివారణ చర్యలు జరగలేదు. ఖరీఫ్ సీజన్లో 50 శాతం సబ్సిడీకి విత్తనాలు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతునప్పటికీ మినుము, పెసర, తదితర పంటల విషయంలో చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి సంబంధిత కోట విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన వింజమూరు, మర్రిపాడు, రాపూరు, పొదలకూరు తదితర ప్రాంతాలలో మినుము పంట కోసం 4,500 క్వింటాళ్లు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలయ్య ఇదే విషయాన్ని స్పష్టం చేసి తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇదే అదునుగా అనేకమంది అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సంఘటనలు జిల్లా సర్వసభ్య సమావేశంలో నెలకొన్నాయి. నీటిపారుదల శాఖ పెన్నాడెల్టా ఆధునీకరణ, చెరువుల మరమ్మతులు, తెలుగుగంగ పథకం, సోమశిల జలాశయం, వ్యవసాయం, అంటువ్యాధులు వంటి కీలక అంశాలపై బుధవారంనాటి సర్వసభ్య సమావేశంలో అటు అధికారులు గాని, ఇటు ప్రజాప్రతినిధులు గాని సరిగ్గా హాజరుకాకపోవడం వైఎస్ మరణానంతర ప్రభావం సమావేశంలో ప్రస్పుటమైంది. మంత్రి రాంనారాయణరెడ్డితో సహా అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాకపోగా, కేవలం టిడిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే హాజరవడం ఇందుకు నిదర్శనం. కీలకమైన అంశాల చర్చకు ఇందుకు సంబంధించి నిధులు రాబట్టడానికి మంత్రి ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంది. కారణాలు ఏమైనా ఆయన హాజరుకాకపోగా జిల్లా అధికార యంత్రాంగం తరఫున పాల్గొనాల్సిన కలెక్టర్ శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికి వెళ్లడం గమనార్హం. ఇక నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి (కాంగ్రెస్), స్థానిక ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి నగరంలో ఉండి కూడా హాజరుకాకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. ఒకవైపు జిల్లాను అంటువ్యాధులు కటవిటం చేస్తుండగా తండిలేని బిడ్డకు దిక్కెవరన్నట్టుగా జిల్లాకు పెద్ద దిక్కుగా నిలవాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా డుమ్మా కొట్టడంతో అనుశ్చిత స్థితి నెలకొంది. జిల్లా పరిషత్ సమావేశం సుమారు నాలుగున్నర గంటలపాటు కొనసాగినప్పటికీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాయి. రాజకీయంగా పరిశీలిస్తే జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాని గోవర్దన్రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఆనం వర్గం కావాలనే సమావేశానికి హాజరుకాలేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి మరణించాక ఆయన తొమ్మిదవ రోజు అంటే సెప్టెంబర్ 11న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆయనకు నివాళులర్పించింది. కేవలం ముఖ్యమంత్రి సంతాప తీర్మానానికి పరిమితమైన ఆ సమావేశానికి కూడా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరులు నగరంలో ఉండి కూడా సమావేశానికి హాజరుకాకపోగా, అదే సమయంలో విఆర్సి గ్రౌండ్లో ప్రత్యేక సంతాపసభలు నిర్వహించి రాజశేఖర్రెడ్డి చావులో కూడా వర్గ రాజకీయాలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఏదిఏమైనా మున్ముందు పరిస్థితులు ఇలానే కొనసాగితే జిల్లా అభివృద్ధి మరింత దిగజారే అవకాశం ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.
Filed under: వార్తలు | Tagged: కాంగ్రెస్, నెల్లూరు, వైఎస్ | Leave a comment »