మచిలీపట్నం: జిల్లాలో రైతాంగం ధాన్యం అమ్మకం గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, మద్దతుధర కంటే తక్కువకు ఎటువంట పరిస్థితుల్లోనూ అమ్మవద్దనీ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ రైతులను కోరారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుపై మద్దతుధర ఇవ్వడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని సమస్యను అధ్యయనం చేసి రైతులతోను మిల్లర్లతోను మాట్లాడుతున్నామని జాయింట్ కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్యతో కలసి చిలకలపూడి వేర్హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్ వద్ద రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్ లో మిల్లర్లతో సమావేశమైవారి సమస్యలను చర్చించి అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్ లో 1001, 1010 రకం ధాన్యం ఎక్కువగా పండించడం జరిగిందనీ వీటి కొనుగోలు బాగానే జరుగుతుందనీ, యం7, నెల్లూరు సన్నాలు రకం కొనుగోలుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వున్నాయని వీటి విషయంలో రైతులు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదనీ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామనీ ఉప్పల్ అన్నారు.
నెల్లూరు సన్నాల రకంలో నల్లమచ్చ వుందనీ, 3 శాతం కంటే తక్కువ డేమేజ్ వుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అయితే 3 శాతం కంటే ఎక్కువగా ఈ డ్యామేజ్ వున్నందున రిలాక్సేషన్ ఇవ్వాలనీ పౌర సరఫరాల శాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. భారత ఆహార సంస్థను మన జిల్లాకు మినహాయింపు ఇవ్వవలసినదిగా కోరినట్లు తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదనీ వస్తున్న ఆరోపణలపై మిల్లర్లతో మాట్లాడడం జరిగిందనీ, వారు గోడౌన్ లు కొరత వున్న కారణంగా ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్పారనీ, గోడౌన్ కొరత నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసినదిగా భారత ఆహార సంస్థ జి.ఎం. లను కోరినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ నెలలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి స్థలం వస్తుందనీ, 23 రైల్వే ర్యాకులు త్వరలో రానున్నాయనీ ధాన్యం నిల్వలకు పై#్రవేటు గోడౌన్ల యజమానులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని జాయింట్ కలెక్టర్ వివరించారు. మన జిల్లాలో కనీస మద్దతుధరతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో సిడ్లబ్యుసి కైకలూరులో, సిడబ్ల్యుసి గుడివాడలో, ఎఫ్.సి.ఐ హనుమాన్ జంక్షన్ లోసిడబ్ల్యుసి నందిగామలో ఎస్.డబ్ల్యుసి జగ్గయ్యపేటలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పౌర సరఫరాల కార్పోరేషన్ ఆద్వర్యంలో నాగాయలంక, బంటుమిల్లి, పెడన, నందిగామ, ఎ.కొండూరు, తిరువూరు లలో ఆయా మండల సమాఖ్య కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం నాణ్యత కనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుందని కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. రైతులకు ధాన్యం అమ్మకం విషయంలో సమస్యలు వుంటే వెంటనే తమ దృష్టికి నేరుగా గానీ, జిల్లా పౌర సరఫరాల అధికారి ద్వారాగాని, ఆర్.డి.ఒ. ద్వారా గానీ తీసుకువస్తే వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఇప్పటివరకు జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని మిల్లర్లు లక్ష్యం పెంచమని అడిగిన కారణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందనీ మరో 50,000 మెట్రీక్ టన్నులకు లెవీ పెంచే అవకాశమున్నదని జాయింట్ కలెక్టర్ అన్నారు.
స్థానిక మార్కట్ యార్డుగోడౌన్లో గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఇవిఎం మిషన్లను తీయించి ఖాళీచేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మిల్లర్లు రైతులతో నేరుగా సంబంధాలు కలిగివుంటారు, కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలు తమ దృష్టికి తీసుకురావలసిందిగా జాయింట్ కలెక్టర్ మిల్లర్లకు విజ్ఞప్తిచేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి కె.సింగయ్య మాట్లాడుతూ రైతులు తాము అమ్మదలుసుకున్న ధాన్యాన్ని ఒకేసారి తీసుకురాకుండా కొంత శాంపిల్ తీసుకువస్తే ఇక్కడ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించి మద్దతుధర నిర్ణయిస్తారని ధర అనుకూలంగా వుంటే అప్పుడు మొత్తం ధాన్యాన్ని తీసుకురావచ్చునని అన్నారు.
కొనుగోలు కేంద్రం వరకు రైతులు తమ స్వంతఖర్చులతో ధాన్యాన్నీ తీసుకురావాలని అన్నారు.
ఈ సమావేశంలో బందరు శాసనసభ్యులు పేర్నినాని, భారత ఆహార సంస్థ జి.అన్నామలై, సివిల్ సప్లై సిబ్బంది, బందరు మార్కెట్ యార్డు ఛైర్మన్ మోకా భాస్కరరావు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Filed under: వార్తలు | Tagged: అమ్మకం, కృష్ణా, ధాన్యం, మచిలీపట్నం, మద్దతు ధర, రైతాంగం | Leave a comment »