గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్లో కలెక్టర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు చైతన్య యాత్రలలోని అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఈ సవత్సరం తగిన ముండు జాగ్రత్తలతో, సమాచారంతోరైతుల వద్దకు వెళ్లాలన్నారు. ఇటీవల ముగిసిన ప్రజాప్ధం కార్యక్రమం వలెనే రైతు చైతన్య యాత్రలను కూడా ఘనంగా నిర్వహించాలన్నారు. రైతుచైతన్య యాత్రలలో అధికారుల దృష్టికి వచ్చిన రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యమైన అంశాలపై జూన్ మాసంలో జరిగే రైతు సదస్సులలో ప్రస్తావించి తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని కలెక్టర్ తెలియచేశారు.
ఈ విషయాలను రైతులకు స్పష్టంగా తెలిజెప్పాలన్నారు. 2009-10 సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ ప్రణాళిక అమలును పకడ్బందీగా నిర్వహించడం, వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలుపరచడం, రైతుల పట్ల అధికారుల స్పందన, తదితర కార్యక్రమాల నిర్వహణ వలన రాష్ట్రస్ధాయిలో ఉత్తమ సంయుక్త సంచాలకులుగా ఐ.రామకృష్ణమూర్తి ప్రభుత్వం నుండి అవార్డు పొందడం హర్షదాయకమని అన్నారు. ఇదే రీతిలో ఈ సంవత్సరం కూడా మరిన్ని ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయవలసి ఉంటుందని కలెక్టర్ సూచించారు.
ప్రజాపధం కార్యక్రమంలో ఇన్పుట్ సబ్సిడీ పంపిణీపై రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. అలాగే నిల్వ ఉన్న ధాన్యాన్ని కోనెందుకు ఎవరూ ముండుకు రావడంలేదన్న విషయాన్ని రైతులు అనేక సార్లు తెలియజేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశం మొత్తం మీద ఒకే నిబంధన ఉందన్నారు. రైతుల వద్ద వున్న ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రైతు చైతన్య యాత్రలలో అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు.
అదే విధంగా మిర్చి యార్డులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులకు ఇంకనూ కోటి 80 లక్షల రూపాయలు చెల్లించవలసి వుందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే రైతులకు చెల్లించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా రైతులకు వివరించాలన్నారు. అలాగే భీమా తాలూకు సొమ్ము నాలుగున్నర కోట్ల రూపాయలలో ఇప్పటి వరకూ 3 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట విస్తీర్ణం, దిగుబడి పెరిగే అవకాశం వుందన్నారు.
గ్రామాలలోని ఆదర్శ రైతుల ద్వారా ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేసింది వివరాలను ముందుగా జాగ్రత్త చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి రైతు బ్యాంకులలో ఖాతాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకులో ఖాతా లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అధికారులు కృషి చేయవలసి ఉంటుందని ఆయన సూచించారు. గ్రామాలలో సభలను నిర్వహించి ఖరీఫ్లో డిమాండ్ ఎంత ఉందో చర్చించాలన్నరు. రైతులకు అనుకూలమైన సమయాలలో అధికారులు వెళ్ళి పంట దిగుబడి పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను వివరించాలన్నారు. విధి నిర్వహణ లో అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాదని ఆయన స్పష్టం చేశారు.
రైతు చైతన్య యాత్రలలో ప్రతి శాఖ అధికారి రైతులకు అండుబాటులో వుండాలని, వారు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహించవలసిన ఉమ్మడి కార్యక్రమం రైతు చైతన్య యాత్రలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ ఐ.రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. రైతు చైతన్య యాత్రలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాౖయ, సశుసంవర్ధక, మత్స్య, అటవీ, పట్టు పరిశ్రమ, ఉద్యానవన శాఖలు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం రైతు చైతన్య యాత్రలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ దామోదర నాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు బసవరాజు, డివిజనల్ అటవీ శాఖాధికారి శ్రీనివాస శాస్త్రి, పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు సులేమాన్ బాషా, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మధుసూధన రెడ్డి, పద్మావతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Filed under: వార్తలు | Tagged: అధికారులు, అనుబంధ శాఖలు, గుంటూరు, రైతు చైతన్య యాత్రలు, విజయవంతం, వ్యవసాయం | Leave a comment »